Wednesday, April 17, 2024

బదులు

ఆరుబయట ఆనబపాదు
అడుగుకో కాయ చొప్పున
విరగకాచింది.
 
ఎప్పటిదో చిన్న విత్తనం

ఏం ఇచ్చాను నేను
అరచెయ్యంత చోటు
ఎప్పుడైనా కెక్కరించే కోళ్ళను తరిమి
నాలుగు తుంపర్ల నీరు చల్లుంటాను

అంతే
నా జీవితాన్ని పెనవేసుకొంది ప్రేమతో
సూర్యకాంతిలా

బొల్లోజు బాబా

మనవి మాటలు

గత నాలుగేళ్ళుగా రాస్తున్న చరిత్ర వ్యాసాలను వేదబాహ్యులు అనే పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొని వద్దామని నిర్ణయించుకొన్నాక రాతప్రతిని ఎవరైన రివ్యూ చేస్తే బాగుంటుందని అనిపించింది.

శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు ఈ ఫేస్ బుక్ లో పరిచయం. నాలుగేళ్ళ క్రితం హిందూ ఆలయాలకు ఏం జరిగింది అనే నా పోస్టు లో వారూ నేను మొదటి సారిగా అభిప్రాయాలు పంచుకొన్నాం. ఇటీవల భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు అనే పోస్టులో కూడా చర్చించుకొన్నాం. ఈ పరిచయంతోనే శ్రీనివాస్ గారు ఎంతో ప్రేమతో నాకు Douglas Ober రాసిన Dust on the throne అనే పుస్తకాన్ని కాన్కగా కొరియర్ లో పంపించారు. చాలా సంతోషం వేసింది. అంతర్జాల మిత్రులనుండి గిఫ్ట్ అందుకోవటం అది రెండవ సారి . ఎప్పుడో బ్లాగుల కాలంలో వేల్పూరి సుజాత గారు జరుక్ శాస్త్రి పేరడీల పుస్తకాన్ని పంపించారు.
 
శ్రీనివాస్ గారు మంచి చదువరి, బహుభాషా కోవిదులు, విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి నిర్ధారించుకొంటే తప్ప విశ్వసించరు. నేను చూసినంత మేర భద్రుడు గారి తరువాత నాకు తటస్థించిన అంతటి వొరేషియస్ రీడర్ శ్రీనివాస్ గారే.
 
శ్రీనివాస్ గారిని ఈ వ్యాసాలను ఎడిట్ చేసిపెట్టమని అడిగాను కొంత జంకుతూనే. వారు అంగీకరించి ఎంతో లోతుగా ఈ వ్యాసాలను రివ్యూ/ఎడిట్ చేసారు. చాలా అక్షరదోషాలను, వాక్యనిర్మాణ దూడలను సరిచేసారు. ప్రతీ అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను ఎంతో మెరుగుపరిచాయి. ఎడిటర్ గా పేరు వేసుకొంటాను అని అడుగగా సున్నితంగా తిరస్కరించారు.
 
జనరల్ గా నా ఏ పుస్తకానికైనా ముందుమాటలలో మిత్రులందరి పేర్లు ప్రస్తావించటం పరిపాటి. ఈ పుస్తకానికి ఒక్క శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారి పేరు మాత్రమే ఉండటం వెనుక కారణం ఇది.
వారికి సదా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను

వేదబాహ్యులు పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.
*******
మనవి మాటలు
.
ప్రాచీన భారతదేశ ప్రజల విశ్వాసాల గురించి అధ్యయనం చేయటం ఒక నిరంతర శోధన. వైదిక సంప్రదాయం హిందూమతం రూపుదిద్దుకొనకముందు ఈ నేల భిన్న సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఆలవాలంగా ఉంది. హిందూ మతానికి వెలుపల బౌద్ధులు, జైనులు, చార్వాకులు, ఆజీవికులు లాంటి ఎందరో ఈ నేలపై జీవించారు. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించారు.
హిందూమతం మాత్రమే భారతదేశపు ఆత్మ అని పలికే మాటలకు ఈ వేదబాహ్య సంస్కృతి ఒక కనువిప్పు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పాంచరాత్రికులు, కాపాలికులు, పాశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పాంచరాత్ర పూజావిధానం (cult) మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.
వేదబాహ్యులను నీతిశాస్త్రాలు చాలా తక్కువ చేసి మాట్లాడాయి. గృహస్తులెవరూ వీరిని ఆదరించరాదని మనువు; నాస్తికులను పరిహరించాలని యాజ్ఞవల్క్యుడు; సాక్షులుగా పెట్టుకోరాదని నారదుడు; ఆపత్సమయాలలో వేదబాహ్యుల ఆస్తులను రాజు స్వాధీనం చేసుకొనవచ్చునని అంతేకాక వారితో సన్నిహితంగా ఉండేవారిపై అధికపన్నులు విధించవచ్చునని కౌటిల్యుడు; వేదబాహ్యులు రాజ్యంలోకి ప్రవేశించరాదని సౌరపురాణము; వేదబాహ్యులను రాజు శిక్షించాలని శుక్రనీతిసారము- అంటూ నీతిశాస్త్రకారులు తమ గ్రంథాలలో వీరిపట్ల సమాజం వ్యవహరించాల్సిన పద్దతులను నిర్దేశించారు.
 
ఇన్ని వెలివేతలు పెట్టినా సంఘంలో వేదాలను ధిక్కరించి జీవించేవారి సంఖ్య తక్కువ ఏమీ ఉండేది కాదు.
 
“History of India is nothing but the battle between Buddhism and Brahmanism.” – Dr. B.R. Ambedkar

ఈ వైదిక, అవైదిక విశ్వాసాలు చరిత్రలో ఘర్షించుకొన్నాయి. ఒకదానినొకటి మెరుగుపరుచుకొన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. వేదబాహ్యులు భారతీయ ఆత్మను, బహుళతను తీర్చిదిద్దారు. వ్యక్తులు గతించిపోతారేమో కానీ వారు చేసిన ఆలోచన నమసిపోదు
‌‍****
బాబ్రిమసీదు కూల్చివేత ఆధునిక భారతదేశ చరిత్రలో కీలకమలుపు. ద్వేషం, విభజన నింపుకున్న రాజకీయాల కారణంగా ఒకే దేవుడు, ఒకేమతం, ఒకే సంస్కృతి లాంటి అంశాలు ముందుకు వచ్చాయి. ఇవి భారతీయ ధర్మంలోని బహుళతను విచ్ఛిన్నం చేస్తున్నాయి.
ఇప్పుడు అన్నిచోట్లా మెజారిటేరియన్ వాదం ప్రబలంగా నడుస్తూంది.
 
ఈ దేశ సంస్కృతిని నిర్మించటంలో ప్రధాన పాత్రవహించిన వేదబాహ్యులు నేడు సమాజపు అంచుల్లోకి నెట్టబడ్డారు. నిజానికి వీరు ఈ దేశమూలవాసులు.
 
చరిత్రలో వేదబాహ్యులు నెరపిన సామాజిక, సాంస్కృతిక పాత్రను గురించి ఈ వ్యాసాలు మాట్లాడతాయి. స్వేచ్ఛ, సమానత్వం, కార్యకారణ వివేచన, లౌకికత్వం కొరకు వారు ఎలా నిలబడ్డారో చెబుతాయి. నేటి మెజారిటేరియన్ భావజాలానికి ఒకనాడు సమవుజ్జీలుగా నిలిచిన భిన్న ప్రత్యామ్నాయ విశ్వాసాలకు ఈ పుస్తకం అద్దంపడుతుందని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకరచనలో శ్రీ విరుపుటూరి శ్రీనివాస్ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకం యొక్క ప్రతి అథ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను మెరుగుపరచాయి. వారి మేధకు, వెచ్చించిన కాలానికి నేను ఋణపడి ఉన్నాను.
 
బొల్లోజు బాబా
17/3/2024
.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 దయచేసి ఆదరించండి.



ఇటీవల వార్తల్లో వినుతికెక్కిన పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది.



ఇటీవల వార్తల్లో వినుతికెక్కిన పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది. చరిత్ర తెలియని కొందరు పిఠాపురం లాంటి ఒక కుగ్రామం .... అంటూ మాట్లాడుతున్నారు. వారికోసం....
.
క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంనుండి పిఠాపురం గొప్ప పట్టణంగా విరాజిల్లింది. క్రీపూ 2వ శతాబ్దంలో వేయించిన ఖారవేలుని హాథిగుంఫా శాసనంలో కనిపించే పిథుండా పిఠాపురమే అనటానికి ఆధారాలు ఉన్నాయి.
 
పిఠాపుర సమీపంలో ఉన్న బౌద్ధ ఆరామం కొడవలి వద్ద క్రీశ 2 వ శతాబ్దంనాటి శాతవాహనరాజు వేయించిన శాసనం లభించింది.

క్రీశ 4 వ శతాబ్దంలో సముద్రగుప్తుడు వేయించుకొన్న ప్రసస్తి శాసనంలో పిఠాపురాన్ని జయించానని గర్వంగా చెప్పుకొన్నాడు

వేంగి రాజ్య స్థాపన నిజానికి 7వ శతాబ్దంలో పిఠాపురంలో కుబ్జవిష్ణువర్ధనుడిచే జరిగింది.
హుయాన్ త్సాంగ్ క్రీశ 631 లో పిఠాపురం సందర్శించి ఉండొచ్చునని ఆధారాలు ఉన్నాయి.
 
కాలక్రమేణా తూర్పుచాళుక్యులు, కొప్పుల నాయకులు, గజపతులు,పూసపాటి రాజులు గోల్కొండ నవాబులు, బ్రిటిష్ వారు ఈ పట్టణాన్ని పాలించారు
 
దోనేపూడి శాసనంలో (క్రీశ1337) పిఠాపురపట్టణ వర్ణనలు ఈ విధంగా ఉన్నాయి

పిఠాపురీ జయతి తత్ర సమస్తదేవ
శక్తి ప్రయత్నపరికల్పిత తోరణశ్రీః
యస్యాస్సునిర్మలనభోముకురాంతరాలే
ధత్తే సురేంద్రనగరీప్రతిబింబలీలమ్
 
(తాత్పర్యం: సమస్తదేవతలు కొలువున్న పిఠాపురం యొక్క అందాలు ఎంతటి దివ్యమైనవి అంటే ఆకాశం అనే అద్దంలో పిఠాపురం అందాలే ఆ ఇంద్రుని అమరావతి అందాలుగా ప్రతిబింబిస్తున్నాయి)

యత్ సౌధాగ్రనిషణ్ణవారవనితావక్త్రేందుమధ్యస్థితః
స్వైరం నైషవిభావ్యతే హిమరుచిస్తేభ్యోవిభిన్నాకృతిః
ఏవం చేతపి శకితేనరచితో ధాత్రాకళంకస్ఫుటమ్
నోచే దీదృశి నిర్మలే కథ మిదమ్ మాలిన్య ముజ్జృంభతే.
 
(తాత్పర్యం: పిఠాపురం భవనాల మిద్దెలపై వెన్నెలలో కూర్చున్న నాట్యకత్తెల గుండ్రని వెలుగులీనే మొఖాలలో కలిసిపోయి చంద్రుడు కనిపించటం లేదట. అందుకని బ్రహ్మదేవుడు చంద్రునిపై నల్లమచ్చలు పెట్టటంతో ఆ అప్సరసల ముఖబింబాల మధ్య చంద్రబింబాన్ని గుర్తించటం వీలయిందట)

ఒకనాటి పిఠాపురం భౌతిక వర్ణనను ఒక పద్యంలో శ్రీనాథుడు ఇలా చిత్తరువుగా నిలిపాడు
సీ|| ఏటేట విలినీట నిరుగారునుం బండు
బ్రాసంగు వరిచేల బసిడిచాయ
బరిపాకమున వేరుపనసపండుల తావి
ఇందిందిరములకు విందుసేయు
వేబోక ఒలుపారు వింధ్యాద్రిపవనంబు
పోకపువ్వుల తావి బుక్కిలించు
వేశ్యవాటికలందు విహరించు వలరాజు
ననయంబు జెఱకువిల్లును ధరించు
తే.గీ. నారదంబులవలపు పొన్నల బెనగి
విచికిలామోదములతోడ వియ్యమందు
బాటలీపుష్ప కేతకీపరిమళములు
పొదల విలసిల్లు బీఠికాపురమునందు.

(తాత్పర్యం: ఎటు చూసినా బంగారు వన్నెల వరిచేలు, తుమ్మెదలకు విందు చేసే బాగా ముగ్గిన పనస పండ్ల సువాసనతోను; వింధ్య పర్వతపు పోక పువ్వుల పరిమళాలను పుక్కిలించే చల్లనైన గాలులతోను; మన్మధుడు తన చెరుకు వింటిని ఎక్కుపెట్టే వేశ్య వాడలతోను; పొన్నపూలు, పాటలీ పుష్పాలు, పరిమళాలు వెదజల్లే పొదలు కలిగిన పిఠాపురం -- లాంటి వాక్యాలలో శ్రీనాథుడు (1380-1470) ఆనాటి పిఠాపురం picturesque సౌందర్యాన్ని కళ్లముందు నిలుపుతాడు)
 
***
పిఠాపురం వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిఉంది. శతాబ్దాలపాటు ఆంధ్ర దేశానికి రాజధానిగా వ్యవహరించిన ప్రాచీన పట్టణమైన పిఠాపురవైభవం గురించి సుమారు 30 పేజీల వ్యాసం ఇటీవలే ద్వితీయముద్రణకు వచ్చిన "తూర్పుగోదావరి ప్రాచీనపట్టణాలు" పుస్తకంలో కలదు. లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి. నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.

బొల్లోజు బాబా



చివరిచూపుల తరువాత....

బాడీని పూడ్చిపెట్టాక
స్నానం చేసి
ఉప్పుకల్లు నోట్లో ఉంచుకొని
దీపం వెలుగుకి దణ్ణం పెట్టుకొని
బస్సెక్కేసాను.

సీట్లో కుదురుకున్నాకా
కలలు కబళించాయి
జ్ఞాపకాలు, కలలు కలగలిసిపోయి
వింతైన లోకంలో దించాయి

అక్కడ
ముడుతలు పడిన చేతుల్ని
పెదాలవద్దకు తీసుకొని
నేను పుట్టినప్పుడు నా చిట్టి చేతివేళ్ళమధ్య
మృదువుగా తన చూపుడు వేలు ఉంచినంత
మెత్తగా ముద్దుపెట్టుకొన్నానట

తన చివరి ఫోన్ కాల్ లో 'చూడాలనుందిరా'
అన్నవెంటనే శలవుపెట్టి పద్మా, పిల్లలతో వెళ్ళి
తనతో వారం రోజులు గడిపిపానట

ఎర్రటి ఎండలో నిలుచుని
తనని పాతిన చోట ఏర్పడిన మట్టి దిబ్బను
చేతులతో తడుముతూ జార్చుకొన్న
కన్నీళ్ళు ఆ నెర్రలలోకి ఇంకిపోయాయట

కుంపటిపై అటూ ఇటూ సర్దబడే
మొక్కజొన్న కండెలా హృదయం
డ్రింకు సీసాలో చిక్కుకొని తెల్లార్లూ
ఎగబాకుతూనే ఉన్న చిమ్మెటలా ఆలోచనలు

సార్, మీ స్టాప్ అన్న కండక్టర్ కేకతో లేచి
బాగ్ తీసుకొని బస్సుదిగి పద్మకు ఫోన్ చేసి
"పిల్లల్ని స్కూల్ నుండి పికప్ చేసుకొని
వస్తాను, నువ్వు వెళ్ళక్కరలేదు" అని చెప్పాను


బొల్లోజు బాబా

పారిపోలేం...

ఇక్కడ ఉండాలంటే
ఈ దేహం ఉండాలి
దీన్ని విడిచి ఎక్కడికీ పారిపోలేం
ఇది చిరిగి జీర్ణమైపోయాకా
నూతన వస్త్రాలను ధరించవచ్చుననే
ఆశ ఒక్కటే
ఇన్ని లోపాలతో, గాయాలతో ఉండే
ఈ దేహాన్ని మోసుకొని తిరిగేలా చేస్తుంది

ఇంత వరకు అందరూ అదే చేసారు
నవ్వుతూ, ఏడుస్తూ, ప్రేమిస్తూ....

బొల్లోజు బాబా

Friday, March 29, 2024

వేదబాహ్యులు పుస్తకం లభించుచోటు- 9866115655

"వేదబాహ్యులు" రచయిత కాపీలు ఈ రోజు నాకు చేరాయి. ఇది నా 12 వ పుస్తకం. ప్రింట్ క్వాలిటీ బాగావచ్చింది. పబ్లిషర్ పల్లవి నారాయణ గారి వ్యక్తిత్వం, చేసేపనిపట్ల వారి అంకితభావం నాకు నచ్చుతాయి. వారికి ధన్యవాదములు.
ఈ పుస్తకరచనలో శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. వారికి సదా కృతజ్ఞుడను.
ఈ పుస్తకం వెల- రు.225/-
196 పేజీలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్.వి.నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655


దయచేసి ఆదరించండి.


బొల్లోజు బాబా


Thursday, March 28, 2024

ఖాళీతనపు చప్పుడు Noise of the Emptiness by Moumita Alam


నా చివరి ప్రేమికునితో చాలా ఏళ్ళు
చాటింగ్ చేసాను
మాటలు, మాటలు, మాటలు
ఉత్త బోలు మాటలు, అబద్దాలు
అతని ఆఖరి ఫోన్ కాల్ లో
స్వరం అంతమయ్యేవరకూ
వేచిచూసాను
మొద్దుబారిన మైమరుపుతో
ఎదురుచూసాను

సిల్వియా* ఆలోచనలలో
చెప్పలేని నిశ్శబ్దమేదో ఆ గాస్ స్టవ్ మంటను
జ్వలింపచేసి ఉండొచ్చు
ఖాళీతనాన్ని ఎలా నిర్వచించాలి?
పొందికలేని, లోనికి పీల్చుకొన్న ఖాళీతనాన్ని?
సిల్వియా ఖాళీతనాన్ని
స్త్రీ అణచుకొన్న కోపంగా పిలిచారు వారు
మరి నా ఖాళీతనాన్ని ఏమని పిలుస్తారు?

ఖాళీతనం గురించి వారికేమీ తెలియదు
ఖాళీతనం అంటే చప్పుడు
బోలుగా, చీకటిగా లోతుగా ఉండే చప్పుడు
పగిలిన విస్కీసీసాల చప్పుడు
ఉక్కిరిబిక్కిరి అయిన గొంతు చప్పుడు
చేతులను చీల్చినప్పటి చప్పుడు
వారు ఎందుకు చూడలేరు
ఎంపిక అనేది ధీరవనిత ప్రత్యేకహక్కు

Source: Noise of the Emptiness, Moumita Alam
అనువాదం: బొల్లోజు బాబా

*సిల్వియాప్లాత్ - గాస్ ఓవెన్ లో తలపెట్టి ఆత్మహత్యచేసుకొన్న అమెరికన్ స్త్రీవాద కవయిత్రి

అభినందనలు! మీ మౌనం గెలిచింది - Congratulations! Your Silence Has Won! by Moumita Alam


హోలోకాస్ట్ ఒక్కసారిగా జరిగిందా
బిగ్ బాంగ్ లా?
లేదు.
అది మెల్లగా మొదలైంది
పద్దతిగా. పథకం ప్రకారం. క్రమక్రమంగా.

చరిత్రను చెరిపేశారు
మనుషులను రాక్షసులుగా మార్చారు
సమాధులని చదునుచేసారు
మాట్లాడేవారిని మాయం చేసారు
Wali Dakhani* రోడ్డుగామారింది.
రేపిస్టులు* సంస్కారులుగా కీర్తించబడ్డారు

కాలిబొగ్గుగా మారిన దేహాలు నా కలల్లో
పదే పదే కనిపించేవి.
వాటిని అడిగాను
గాస్ చాంబర్స్ లోకి వారిని నడిపించిన శక్తులేవి
నేరస్తులు ఏ పాటలు పాడుతున్నారు అని?
అవి ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చాయి
మా ఇరుగుపొరుగు వ్యక్తుల మౌనం
భయంకరమైన మౌనం. వెంటాడే మౌనం..అని

ఆ మౌనం
బస్సులలో, టీవీలలో, వార్తా పత్రికలలో
వంటిళ్లలో, పార్లమెంటులో ఉన్నట్లు
బిగ్గరగా ఉంటుందా అని
అడగటానికి సాహసించలేకపోయాను

కాలిన చర్మపు వాసన ఒక అంటురోగం
నా చర్మంపై ఆ వాసన తెలుస్తోంది.
అభినందనలు!
భీకరమైన మీ మౌనానికి.
మీరే గెలిచారు.

మూలం: Congratulations! Your Silence Has Won! by Moumita Alam
అనువాదం: బొల్లోజు బాబా

*Wali Dakhani మతాతీతంగా కొలువబడే ఒక సూఫీ కవి దర్గా. గోద్రా అల్లర్లలో నేలమట్టం చేయబడి దాని స్థానంలో  తారురోడ్డు వేయబడింది. 
*బిల్కిస్ బనోని రేప్ చేసినవారు సంస్కారులని ఒక నాయకుడు అన్నాడు

Friday, March 22, 2024

 ప్రెస్ కు వెళిపోయింది. పల్లవి పబ్లికేషన్స్.

200 పేజీలు
ఆర్టిస్టు గిరిధర్ కు ధన్యవాదములు
పిక్చర్ - నాగరాజు, రాణి శిల్పం, అజంతా గుహలు
బొల్లోజు బాబా

Thursday, March 21, 2024

కవిత్వంలో నిరలంకారత

అలంకరించబడిన వచనాన్ని కవిత్వం అంటారు. సిమిలీ, మెటఫర్, సింబల్, మెటనిమి, పెర్సొనిఫికేషన్, అల్లిగొరి, అల్యూజన్, పారడాక్స్, ఐరనీ, హైపర్బొలి వంటి వివిధ అలంకారాలు కవిత్వాన్ని వచనంనుండి వేరుచేస్తాయి. వీటిని పాశ్చాత్య పరిభాషలో Tropes అంటారు.

“కవితలోఉండే వివిధ అలంకారాలను విశ్లేషించుకొని కవితకు కనక్టవటం కన్నా ఆ కవితావాక్యాలు నేరుగాఇచ్చే ఉద్వేగాన్ని అనుభూతిచెందటం మంచిపద్దతి” అంటాడు ప్రముఖజర్మన్కవి Paul Celan. కవిత్వంలో పలికే ఉద్వేగాన్ని మెటఫర్లు, ఇమేజెరీల ద్వారా కాక నిరలంకారవాక్యాల ద్వారా చెపితే, ఆ ఉద్వేగానికి పాఠకుడు తొందరగా కనెక్టుఅవుతాడని సెలాన్ అభిప్రాయంగా భావించవచ్చు.
 
ఆధునికకవిత్వంలో నేటిజీవితపు సమస్తఅంశాలు కవిత్వీకరించ బడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెప్పదలచుకొన్న అంశం సూటిగా స్పష్టంగా చెప్పటానికి కొన్నిసార్లు అలంకారాలు అడ్డు తగలవచ్చు. అలంకారాలు వస్తువును మరుగున పరచి కవిపొందిన ఉద్వేగాన్ని పాఠకునికి చేరనివ్వకుండా పక్కదారి పట్టించవచ్చు. ఒకకొత్త ఆలోచననో, బరువైన సంఘటననో, బలమైన ఉద్వేగాన్నో చెప్పదలచుకొన్నప్పుడు నిరలంకారంగా చెప్పటంకూడా ఒకమంచి కవిత్వ నిర్మాణ టెక్నిక్.
 
ప్రాంతంవాడేదోపిడిచేస్తే
దోపిడిచేసేప్రాంతేతరులను
దూరందాకా తన్నితరుముతం
ప్రాంతంవాడే దోపిడిచేస్తే
ప్రాణంతోనే పాతరవేస్తం
దోస్తుగఉండే వారితొ మేమును
దోస్తేచేస్తం – ప్రాణమిస్తం// (కాళోజి)

మహాకవి కాళోజీ వ్రాసిన పైవాక్యాలలో ఒక జాతి అంతరంగం ఆవిష్కృతమైంది. నిరలంకార వచనంలా సాగే ఆ కవితలో ఒకసమాజాన్ని ఏకంచేసేటంతటి ఉద్వేగంఉంది. ఆ ప్రాంత ప్రజలందరూ ఆ వాక్యాలను వారిమనోఫలకంపై శిలాక్షరాలుగా లిఖించు కొన్నారనటానికి సాక్ష్యం, వాటిని అనేకమంది పదేపదే తమవ్యాసాలలో కోట్ చేసుకొంటూండటమే. భావోద్వేగాలను, మానవ సంవేదనను వ్యక్తీకరించే కవిత్వానికి అలంకారాలు అవసరంలేదనటానికి మహాకవి కాళోజీ కవిత్వమే నిదర్శనంగా నిలుస్తుంది. వాక్యాలలోని అనుభూతులకు నేరుగా కనక్ట్అవ్వటం అనిPaul Celan చెప్పింది ఇలాంటి వాక్యాల గురించే.
 
“వాణ్నికన్ననేరానికి
నిన్నుతూలనాడుతున్నాను క్షమించుతల్లీ.//
అచ్చం నీలాగా – నీలాగ
ఒక అమ్మాబాబుకు పుట్టినమనిషి
అక్షరాలా మనిషేరా
వాడు మలం తిన్నాడు
ఒరేయ్నీ ఇరవైఒకటోశతాబ్దం
ఆదిమ యుగంనాటి
అజ్ఞానపు గుహలోదాక్కుందా?//
నీ దేవుడికి ఎయిడ్స్ సోకిందా?
ఇప్పుడుచెప్పరా
మళ్ళీమళ్ళీ అడుగుతున్నాను
ఒరే! లంజాకొడకా
నీ పేరు మనిషా?” (వాడే అశుద్ధమానవుడు- శిఖామణి)

ఆలయప్రవేశం చేసినందుకు 1989 లోకర్ణాటకలో ఒక దళితుడుని కొట్టి, బలవంతంగా మనిషిమలం తినిపించారన్న సంఘటననుఖండిస్తూ వ్రాసినకవిత ఇది. ఇందులో ఏ రకమైన అలంకారాలుఉండవు. పూర్తిగా వాచ్యంగా ఉంటుంది. అయినప్పటికీ మానవత్వం ఉన్న ప్రతిఒక్కరిని కదిలిస్తుంది. సాటిమానవునికి జరిగినఅమానుషావమానాన్ని ఈకవిత ఎంతో ఫెరోషియస్ గా ఎత్తిచూపుతుంది. సమాజంలో తన సహచరునికి జరిగిననీచమైన అవమానంపట్ల ఆగ్రహించి ఒకసామాజికబాధ్యతతో వ్రాసినకవితఇది. ఈ కవితపైకి క్రోధప్రకటనలా అనిపిస్తున్నా, అంతర్లీనంగా కరుణ, మానవతలుకనిపిస్తాయి. నిరలంకారంగా ఉన్నప్పటికీ గొప్పదిగా నిలిచిపోవటానికి కారణం కవితలోరక్తాన్నిమరిగించేలా ప్రవహించిన బలమైన ఉద్వేగం.


I Met A Genius- Charles Bukowski

ఈరోజు రైల్లో
నేనో మేధావినికలిసాను
ఆరేళ్ళ వయసుంటుందేమో
అతను నాపక్కనే కూర్చున్నాడు
రైలుసముద్రతీరం వెంబడివెళుతోంది
సముద్రాన్ని చూస్తూఅన్నాడతను
పెద్దఅందంగాఏంలేదని”
అవును నిజమేకదా అనిపించింది
మొదటిసారిగా ---- ( చార్లెస్ బుకొవ్స్కీ)

నిరలంకార కవిత్వాన్ని విస్తారంగా వ్రాసినకవులలో చార్లెస్బుకొవ్స్కీ ఒకరు. దైనందిన సంఘటనలు, సంభాషణలు, అనుభూతులు ఇతనికవిత్వంలో కథనాత్మక రీతిలోఅలవోకగా ఒదిగిపోతాయి. పైకవితలో “సముద్రం పెద్ద అందంగా ఏంలేదని అనేపిల్లగాడిని మేధావి అనిఅనటం”లోతైన తాత్వికతను, కొత్తదృష్టిని సూచించి ఆశ్చర్యపరుస్తుంది. కవితలో కనిపించని ఏదో మిస్టిక్నెస్ ఆకట్టుకొంటుంది. ఒకమామూలు సంఘటనను ఊహించనిమలుపుకు తిప్పి పాఠకునికి ఒకషాక్ ను కలుగచేస్తాడుకవి. నిరలంకారత వల్ల కవిత చాలా లోతుగా గుండెల్ని తాకుతుంది.
 
అలంకార రహితంగా వ్రాసేకవిత్వాన్ని పాశ్చాత్యదేశాలలో Spoken Word Poetry, Slam Poetry అని పిలుస్తున్నారు. స్పోకెన్ వర్డ్ కవిత్వాన్నిఒకఏకపాత్రాభినయం లాగా ప్రదర్శిస్తూ చదవటాన్ని అక్కడి యువతరం గొప్పచైతన్యంతో ముందుకు తీసుకు వెళుతున్నారు. కవిత్వం చదవటం అనేది ఒక Performing Art అని ప్రముఖ కవి శ్రీశివారెడ్డి అనేకసభలలో చెప్పింది బహుశా దీని గురించే కావొచ్చు.

కవి విమర్శకులు శ్రీవాడ్రేవు చినవీరభద్రుడు తన ఫేస్బుక్ పోస్ట్ చేసిన ఒకవ్యాసంలో-అమెరికాలోఉంటోన్న“భావన” అనే అమ్మాయి “Chopping Onions” శీర్షికతో ఇంగ్లీషులో వ్రాసినఒక Spoken Word Poem ను అనువదించి పరిచయంచేసారు. ఆ కవితలోంచి కొన్నివాక్యాలు ఇవి

~ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు~
నాకుబాగాగుర్తుంది నాచిన్నప్పుడోసారి
మాఅమ్మకేసి చూసి అడిగాను
'నువ్వేం చేస్తుంటావు?'అని
నీళ్ళకళ్ళతో చిరునవ్వి చెప్పిందామె
'నేను చేసేదంతా మామూలుగా మనుషులు పట్టించుకోనిదే
ఏమంత ముఖ్యంకానిది,
నేను ఇస్తాను, లాలిస్తాను, పోషిస్తాను
నువ్వు స్కూలునుంచి వచ్చేటప్పటికి నేనిక్కడుంటాను
నీకేదన్నా పెట్టి నీమీదే మనసుపెట్టుకుని ఉంటానిక్కడే.'
అప్పుడు నాకు తెలీదు
ఆకళ్ళల్లో ఆ నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని.// (Chopping Onions – Bhavana)


పైకవితలోఎక్కడా ఏ విధమైన ట్రోప్స్ కనిపించవు. పదిహేడేళ్ల అమ్మాయి ప్రపంచాన్ని ఒకస్త్రీ దృక్కోణంలోఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. కవిత ఆద్యంతం వాడుకభాషలో సాగుతుంది. పెద్దపెద్ద బరువైన పదాలు ఉండవు. “స్వేచ్ఛగా ఇష్టంతో కావలసిన దానిని సాధించుకోవటమే స్త్రీసాధికారత” అన్న విషయాన్ని సూటిగా, ఏ శషభిషలు లేకుండా చెప్పటం ఈ కవితా వస్తువు. ఇదేకవితను భావన ప్రదర్శిస్తూ చదివేవీడియోని కూడా యూట్యూబ్లో చూడవచ్చు. ఇదినేటి తరపు కవిత్వస్వరం, నడుస్తున్న మార్గం.

సిస్టర్అనామిక

అతని
రెండు రెక్కల్లోచేతులుఉంచి
టాయిలెట్ సీట్నుంచిలేపి
పళ్ళుతోమి స్నానంచేయించి
ఒళ్ళుతుడిచి బట్టలుతొడిగి
జాగ్రత్తగా నడిపించి
మంచంపై పడుకోబెట్టి
“మీఅబ్బాయి రమ్మంటున్నాడని అన్నారుగా
వెళ్ళొచ్చుకదా?” అందామె
మాత్రలు వెతుకుతో
నీటిపొర నిండిన కళ్ళతో
సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడతను
ఫోన్ కూడాచేయటం మానుకొన్న
బబ్లూగాడిని గుర్తుచేసినందుకు.

వయసు పైబడిన తల్లితండ్రులను దగ్గర ఉండి చూసుకోలేక నర్సుల సంరక్షణలో ఉంచటం పరిపాటిగా మారింది నేడు. ఎవరికారణాలు వారికిఉంటున్నాయి. ఆ నేపథ్యంలోని ఒక సంఘటనను యధాతధంగా పైకవిత ఆవిష్కరిస్తుంది. కవిత్వాన్ని ఉద్దీపింప చేసే ఏవిధమైన ట్రోప్స్ లేవుకవితలో. పైగా చదవటానికి ఇబ్బందికలిగించే, కాలకృత్యాల వర్ణణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ- పట్టించుకోని కొడుకు గౌరవం కాపాడటానికి, “నన్ను వచ్చేయమంటున్నాడని” చెప్పుకొంటున్న ఒకవృద్ద తండ్రి మూగరోదన బలమైన ఉద్వేగమై పాఠకుని హృదయాల్నితాకుతుంది.
*****

అలంకారాలులేకుండా కూడా మంచికవిత్వం చెప్పగలుగుతున్నప్పుడు ఇకఅలంకారాల ఉపయోగంఏమిటి అన్నప్రశ్నఉదయించక మానదు. ఎంతోశక్తివంతమైన కవితావస్తువు, లోతైన కొత్తఊహలేదా గుండెలను బలంగామోదగలిగేటంతటి సత్తువ కలిగిన ఉద్వేగమూ లేకపోతే నిరలంకార కవిత్వం ఉత్తవచనంగా మిగిలిపోతుంది. త్రిపురనేని శ్రీనివాస్ “వచనమైతేలిపోతావ్” అని హెచ్చరించింది అలాంటికవిత్వం గురించే. ఉత్తవచనానికి లైన్ బ్రేకులు ఇచ్చినంత మాత్రాన అదిఏనాటికీ కవిత్వంకాలేదు

“నోటిమాటలు హృదయానుభవపు చిహ్నాలు కాగా, లిఖితపదాలు నోటిమాటల చిహ్నాలు” అంటాడు అరిస్టాటిల్. హృదయానుభవం మాటలద్వారా నేరుగా వ్యక్తీకరింపబడుతుంది. ఉచ్ఛారణలో ఎత్తుపల్లాలు, వివిధ ఉద్వేగాలను పలికించేటపుడు స్వరంలోమార్పులు, ముఖకవళికలు, హావభావాలు -ఆ హ్రుదయానుభవాన్ని స్పష్టంగా, యధాతధంగా అందించటానికి దోహదపడతాయి. కానీ అదే ఉద్వేగాన్ని లిఖితరూపంలో చెప్పవలసివచ్చినపుడు పదాలశక్తి సరిపోదు. భాష విఫలమౌతుంది. కవి అనుభవించిన ఉద్వేగం పాఠకునికి అదేస్థాయిలోఅందదు. ఈ సందర్భంలో అలంకారాలు సహాయపడతాయి.ఉద్వేగాలను అదేస్థాయిలోఅందించటానికి ఉపయోగపడతాయి.

“నొప్పిగాఉంది” అన్నప్పుడు ఆ చెపుతున్నవ్యక్తి ప్రవర్తన, హావభావాలు, స్వరంలోని వణుకు అన్నీకలిసినొప్పి తీవ్రతనుఅర్ధం చేయిస్తాయి. కానీఅదేమాటను వ్రాసినపుడు చదివేవారికి అతనినొప్పి తీవ్రత అనుభవానికిరాదు.“భరించలేనినొప్పిగాఉంది” అన్నప్పుడు కొంతఅర్ధమౌతుంది. “సూదులతోగుచ్చినట్లునొప్పిగా ఉంది” అన్నప్పుడుమరికొంతఅనుభూతికి వస్తుంది.

“కొన్ని వందలపీతలుదేహంలో సంచరిస్తూ
డెక్కలతో ఎముకల్నికరకరలాడిస్తున్నట్లు నొప్పిగాఉంది”అన్నప్పుడు పాఠకుడు ఆ దృశ్యాన్ని తనమస్తిష్కంలో కల్పనచేసుకొంటాడు. దేహంలో పీతలుతిరగడం, అవి ఎముకల్ని కొరకటంఅనే నూత్నఇమేజెస్ ను నొప్పికి మెటఫర్ చేయటంద్వారా పాఠకునిలోనొప్పి తీవ్రతను ఉద్వేగించగలుగుతాడు కవి. కవిత్వంలో ఉద్వేగాలను పలికించటానికి ఇక్కడ మెటఫర్ సహాయ పడింది. ఉద్వేగాలను పలికించటానికి భాషకుకవిత్వం మినహా వేరేదారిలేదు. సమాచారం కొరకువచనం, ఉద్వేగాలను అందించటానికికవిత్వంఅనేది అందుకనే.
***

ట్రోప్స్ లేకుండా వ్రాసిన కవిత్వంలో తీవ్రమైనఉద్వేగమో, కొత్తఆలోచనోలేకపోతే వచనమై సోలిపోతుంది. నిరలంకారకవిత్వమనేది ఒకప్రమాదకరమైన పొలిమేర. తగినంత శక్తిసామర్ధ్యాలు లేకుండా అక్కడకుప్రవేశించటం కవికికవిగా ఆత్మహత్యాసదృశం. వచనాన్ని, కవిత్వాన్నివేరుచేసేవి అలంకారాలే అన్నఅభిప్రాయంఏర్పడింది అందుకే.


బొల్లోజు బాబా
2018

కవిత్వ భాష పుస్తకం నుంచి